కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల పరిణయాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. స్వామి, అమ్మవార్లు వివాహాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా పరిణయోత్సవం పేరిట తితిదే సంబరాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ యేడాది కూడా ఎంతో వైభవంగా పరిణయోత్సవాన్ని నిర్వహించింది. నారాయణగిరి ఉద్యానవనంలోని పరిణయోత్సవ వేదికను ఆకర్షణీయంగా నిర్మించి అలంకరణలు చేపట్టింది.
గజవాహనంపై శ్రీ మలయప్పస్వామి వూరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేయగా దంతపు పల్లకిపై శ్రీదేవి, భూదేవి అనుసరిస్తూ చేరుకున్నారు. అనంతరం వేదిక వద్ద స్వామి, అమ్మవార్ల మధ్య పూలబంతులాటను అర్చకులు నిర్వహించారు. బంతులాటలో తితిదే ఈఓ సాంబశివరావు దంపతులు, తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఓ కోదండ రామారావులు పాల్గొన్నారు. వేలాడదీచిన పల్లకీపై శ్రీదేవి,భూదేవీ సమేత శ్రీ మలయప్పస్వామి అధిరోహించగా అర్చకులు శాస్త్రోక్తంగా పరిణయోత్సవ ఘట్టాన్ని జరిపారు.
పద్మావతి పరిణయోత్సవాల కోసం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణిమ మండపాన్ని తితిదే ఏర్పాటు చేసింది పరిణయ మండపం మొత్తాన్ని బంగారు వర్ణం ఫైబర్ రేకులతో అందంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వేంచేపు చేసిన వూంజల్ మండపాన్ని ఆపిల్, నారింజ, ద్రాక్ష, మొక్కజొన్న కంకులు, అనాసపండ్లతో తీర్చిదిద్దారు. అలంకరణ మొత్తానికి ఆరు టన్నుల పుష్పాలు, రెండు టన్నుల పండ్లు వినియోగించారు. మండపం అలంకరణ పనులు పుణెకు చెందిన శ్రీ వేంకటేశ్వర ఛారిటబుల్ ట్రస్టు చేపట్టింది. ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత మనోహరంగా అలంకరించారు. మరో రెండు రోజుల పాటు పరిణయోత్సవాలు జరుగనున్నాయి.