Publish Date: Fri, 29 Apr 2016 (13:42 IST)
Updated Date: Fri, 29 Apr 2016 (13:44 IST)
భారతీయ హైందవసనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైనదేకాక ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంటూ ప్రపంచానికి దిక్సూచిలా ముందుకు సాగుతుందని ప్రముఖ మహా సహస్రావధాని, చమత్కార కళాధురంధరుడు గరిగపాటి నరసింహారావు తెలిపారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఆధాత్మికత్వంలో సాంకేతిక పరిజ్నానం అనే అంశంపై తితిదే ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.
హైందవ సనాతన ధర్మంలోని విలువలను నేటి సాంకేతికతతో తమదైన చమత్కార రీతిలో స్వచ్ఛమైన తెలుగులో అందరికీ అర్ధమయ్యేరీతిలో తెలిపారు. మానవ జీవితాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలుగువారు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వైకుంఠపాలి ఆటతో సమన్వయం చేస్తూ చెప్పిన విధానం సభలని వారిని విశేషంగా అలంకరించింది.
ముద్ర, ఆలయంలోని ధ్వజస్థంభం, తిలకధారణ వంటి విషయాల ప్రాశస్త్యాన్ని ఆయన నేటి సాంకేతిక పరిజ్నానంతో జోడించి చెప్పిన తీరు ఆద్యంతం హాస్యరస ప్రధానంగా సాగి సభలోని వారిని ఉత్తేజితులను చేసింది. కార్యక్రమంలో గరిగిపాటిని తితిదే ఈఓ సాంబశివరావు ఘనంగా సత్కరించారు.