Publish Date: Mon, 04 Apr 2016 (12:47 IST)
Updated Date: Mon, 04 Apr 2016 (12:54 IST)
తిరుపతిలో వెలసిన కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని మీనలగ్నంలో ధ్వజ స్తంభంపైకి వేదపండితులు ఎగురవేసి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తుల గోవిందనామస్మరణల మధ్య ధ్వజారోహణ ఘట్టం పూర్తయ్యింది.
ధ్వజారోహణం తర్వాత తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ రాముడు ధర్మస్వరూపుడని, ఆయన ఆదర్శాలను భక్తులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏఫ్రిల్ 16న, ఇటీవల తితిదేలో విలీనమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఏఫ్రిల్ 20వ తేదీన, చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో 21వ తేదీలలో సీతారామ కళ్యాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ధ్వజారోహణాన్ని పురస్కరించుకుని కోదండరాముని ఆలయంలో శ్రీరామ కోటి రచనను ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ప్రారంభించారు.