Publish Date: Tue, 07 Jun 2016 (11:56 IST)
Updated Date: Tue, 07 Jun 2016 (11:59 IST)
తిరుపతిలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జూన్ 8వ తేదీన స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. శ్రీరామ చంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం తితిదే నిర్వహించనుంది.
కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు 500 రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చని తితిదే తెలిపింది. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదంను బహుమానంగా అందజేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడా వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు.
అక్కడి నుంచి శ్రీరామ చంద్ర పుష్కరిణికి తీసుకెళ్ళి వూంజల్ సేవ చేపడతారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణలతో రావాలని తితిదే విజ్ఞప్తి చేస్తోంది.