Publish Date: Fri, 01 Apr 2016 (12:18 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (12:20 IST)
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో రూ.300 విలువ చేసే టిక్కెట్ కొనుగోలు చేసి శీఘ్రదర్శనం పొందిన భక్తులను ఎట్టి పరిస్థితిల్లోనూ స్వామివారి మూలవిరాట్ వరకు అనుమతించేది లేదని తితిదే కార్యనిర్వహణాధికారి సాంబశివరావు స్పష్టం చేశారు.
'డయల్ యువర్ ఇఓ' కార్యక్రమంలో పాల్గొన్న తితిదే ఈవోను పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రద్దీలేని సమయంలో జయ, విజయల నుంచి కాకుండా స్వామి ముందు వరకు అనుతించాలని కొంతమంది భక్తులు కోరారనీ, కానీ, ఈ విషయంలో తితిదే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ విధంగానే ముందుకు వెళుతుందే కానీ, దర్శన విషయంలో ఎలాంటి మార్పులు చేయబోమని తేల్చి చెప్పారు.
పూర్తిగా రద్దీ లేకుండా కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్న సమయంలో 300 రూపాయల శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారిని మూలవిరాట్ వరకు అనుమతించాలని ఎన్నోసార్లు భక్తులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. 300 రూపాయల శీఘ్రదర్శనాన్ని మూలవిరాట్ వరకు అనుమతిస్తే వీఐపీ దర్శనానికి శీఘ్రదర్శనానికి ఎలాంటి వ్యత్యాసం ఉండదని అందుకే జయ, విజయల వరకే శీఘ్రదర్శనాన్ని పరిమితం చేశామన్నారు.
వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ దర్శనాన్ని రద్దు చేశామన్న విషయాన్ని మరోసారి తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం మాత్రమే ఉదయం వేళల్లో వృద్ధులు, వికలాంగులను అనుమతించకుండా మధ్యాహ్నం సమయంలో మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మిగిలిన వారాల్లో యధావిధిగా ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి అనుమతినిస్తామని చెప్పారు. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం సముదాయాల్లో గదుల కేటాయింపులో కొన్ని తప్పులు దొర్లుతున్నాయని, సిస్టం ద్వారా ఇవి పునరావృతమవుతున్నాయని, ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఇలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు చెప్పారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో ఈనెల 20వ తేదీ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 8వ తేదీ కన్నడ ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఎస్విబిసి ఛానల్లో కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గంటకుపైగా కన్నడ, తమిళ భాషలలో స్వామివారి కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు ఆయన చెప్పుకొచ్చారు.