Publish Date: Fri, 18 Mar 2016 (12:29 IST)
Updated Date: Fri, 18 Mar 2016 (12:37 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. రెండురోజుల పాటు భక్తులు లేక తిరుమల బోసిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్ర, శని, ఆదివారాలలో సాధారణంగా రద్దీ కొనసాగుతుంటుంది. ఈ రోజు కూడా భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది.
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 8కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు వేచి ఉండగా వారికి దర్శనం పూర్తవడానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 59,086 మంది భక్తులు దర్శించుకోగా స్వామివారి హుండీ ఆదాయం 2 కోట్ల 71 లక్షల రూపాయలు వచ్చింది.
తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామి సేవలో దేవగౌడ పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత దేవగౌడ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టిటిడి పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి దేవగౌడ కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్ధప్రసాదాలను దేవగౌడకు టిటిడి అధికారులు అందజేశారు.