Publish Date: Sun, 03 Oct 2021 (13:58 IST)
Updated Date: Sun, 03 Oct 2021 (13:59 IST)
ఈ నెలలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. దీంతో భక్తులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఏవైనా దర్శనం టికెట్లు కలిగి, వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ పరీక్ష నెగటివ్ రిపోర్టు ఉంటేనే భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి రాజీలేదని తేల్చిచెప్పింది.
బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాటపై సమీక్షించేందుకు శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ జెట్టి సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని గోపినాథ్ కోరారు. అదేసమయంలో తితిదే అధికారులు తీసుకునే చర్యలకు కొండపైకి వచ్చే భక్తులు కూడా సహకారం అందించాలని తితిదే అధికారులు కోరారు.