అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో తెప్పోత్సవం తేదీని అధికారికంగా నిర్ధారించారు. ఎండోమెంట్స్ అండ్ ఛారిటీస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఉత్సవం నవంబర్ 2 ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుంది. ఈ వేడుక క్షీరాబ్ది ద్వాదశి శుభ సందర్భాన్ని సూచిస్తుంది.
ఆలయానికి ఎదురుగా ఉన్న పవిత్ర ఇంద్ర పుష్కరిణి (కోనేరు)లో జరిగే ఈ తెప్ప తిరునాళ్ల కోసం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను హంస ఆకారంలోని పడవలపై వుంచి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలి వస్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ ఉత్సవం కోసం పటిష్ట భద్రతతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.