Publish Date: Mon, 29 Mar 2021 (07:30 IST)
Updated Date: Mon, 29 Mar 2021 (07:32 IST)
తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, వచ్చే నెల 14వ తేదీ నుంచి ఈ సేవలను తిరిగి ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఏప్రిల్ 14వ తేదీ నుంచి జరిగే ఆర్జిత సేవలకు భక్తులను కూడా అనుమతిస్తారు. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆర్జిత సేవలు/ఉత్సవాల్లో పాల్గొనే గృహస్తులు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తోంది. గృహస్తులు సేవకు మూడు రోజులు ముందు పరీక్ష చేయించుకుని కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేసింది.
2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, సహస్రకళశాభిషేకం, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర, కస్తూరి పాత్ర, నిజపాదదర్శనం ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు వీటికి బదులుగా బ్రేక్ దర్శనం లేదా సదరు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే సదుపాయాన్ని టిటిడి కల్పించింది.