Publish Date: Wed, 22 Apr 2015 (19:03 IST)
Updated Date: Wed, 22 Apr 2015 (19:05 IST)
శ్రీమన్నారాయణుడి అవతారాల్లో రామ, కృష్ణావతారాలు ప్రత్యేకం. విష్ణుమూర్తి ధర్మ రక్షణ కోసం రామావతారం ఎత్తాడు. త్రేతాయుగంలో ధర్మరక్షణ చేసిన రాముడే, ద్వాపరయుగంలో కృష్ణుడిగా అవతరించాడు. ధర్మమార్గాన్ని ఆశ్రయించిన పాండవులకు అండగా నిలబడతాడు. ఆ సందర్భంలోనే కృష్ణుడు పాండవులకు సీతారాముల ప్రతిమలను ఇచ్చినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రతిమలు పూజాభిషేకాలు అందుకుంటోన్న క్షేత్రంగా 'రామతీర్థం' దర్శనమిస్తుంది. విజయనగరం జిల్లాలో గల ఈ క్షేత్రం శ్రీరామచంద్రుడికి సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోంది.
పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతూ, ఎల్లవేళలా తమపట్ల అనుగ్రహాన్ని కలిగి ఉండమని కృష్ణుడిని ప్రార్థిస్తారు. దాంతో ఆయన తాను రామావతారంలో సంచరించిన ప్రాంతంలో అరణ్యవాసాన్ని కొనసాగించమని పాండవులతో చెబుతాడు. సీతారాముల ప్రతిమలను ఇచ్చి, వాటిని పూజిస్తూ వుండటం వలన వారు కోరుకునే రక్షణ లభిస్తుందని అంటాడు. అలా పాండవులచే పూజించబడిన ఈ ప్రతిమలు ఆ తరువాత కాలంలో కనిపించకుండా పోయాయి. చాలాకాలం క్రితం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తురాలికి స్వప్నంలో రాముడు కనిపించి తన జాడను తెలియజేశాడు.
అదే సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తోన్న రాజుకి కూడా కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. అలా ఇక్కడి రాముడు వెలుగులోకి వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.