Publish Date: Tue, 16 Jul 2024 (20:53 IST)
Updated Date: Tue, 16 Jul 2024 (20:54 IST)
ఆషాఢంలో తొలి ఏకాదశి వస్తుంది. దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. జూలై 17వ తేదీ బుధవారం నాడు ఈ ఏకాదశిని ఆచరిస్తారు. ఈ రోజున ఉదయం నుండి సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది.
ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతమవుతుంది. దేవశయని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపవాసం పాటించిన వ్యక్తి మరణం అనంతరం మోక్షం పొందుతాడు. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
దేవశయని ఏకాదశి తిథి జూలై 16, 2024 రాత్రి 08:33 గంటలకు ప్రారంభమై. జూలై 17, 2024 రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. జూలై 18న పారణ సమయం ఉదయం 05:35 నుండి 08:20 గంటల వరకు వుంటుంది.
ఈ రోజున ఏకాదశి ఉపవాసం ఆచరించడం అత్యంత పవిత్రం. తర్వాత దేవశయని ఏకాదశి కథ చదువుకోవాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః " అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సమేత లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి.
తులసి లేకుండా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించకూడదు. అయితే ఏకాదశి రోజు తులసి ఆకులు మాత్రం పొరపాటున కోయకూడదు. ముందు రోజునే కోసి సిద్ధం చేసుకోవాలి. నైవేద్యంగా బెల్లం, పప్పు, ఎండు ద్రాక్ష, అరటి వంటివి సమర్పించవచ్చు.
ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది.
పురాణాల ప్రకారం, ఒక రాజు సుదీర్ఘకాలం కరువుతో బాధపడ్డాడు, అది అతని రాజ్యానికి అపారమైన కష్టాలను కలిగించింది. దేవశయని ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించమని ఒక ఋషి రాజుకు సలహా ఇచ్చాడు. రాజు సలహాను అనుసరించి, ఉపవాసాన్ని నిజాయితీగా ఆచరించి, విష్ణువును ప్రార్థించాడు. రాజు భక్తికి సంతోషించిన విష్ణువు ఆ రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి, శ్రేయస్సు, సంతోషాన్ని పునరుద్ధరించాడని చెప్తారు.