Publish Date: Sat, 09 May 2020 (19:42 IST)
Updated Date: Sat, 09 May 2020 (19:45 IST)
దేవుణ్ణి నమ్మేవాళ్ళలో రెండు రకాలు ఉన్నారు. దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు, ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనేవారు కొందరు. దేవుడికి ఆకారమిచ్చి, పూజలు చేసేవారు కొందరు. దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి. దేవాలయానికి వెళ్తే, మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు, అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది. కొండంత ఉపశమనం కలుగుతుంది.
తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటారు. బిగ్గరగా మంత్రాలు పఠించడం, పూజలు, పునస్కారాలు చేయడం, జపాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తాము అనుకున్నది సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇంకొంతమంది కోరిన కోరికలు నెరవేరడానికి భగవంతునికి ఉపవాసాలూ ఉంటుంటారు. పలు రకాల వ్రతాలూ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది భక్తులు గంటలకొద్ది పూజలు, వేలకొద్ది జపాలు, అనేక వ్రతాలు, ఉపవాసాలూ చేసినా ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవడంతో నిరాశపొందడం జరుగుతుంది.
భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా పేర్కొంటారు. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.