స్మశానానికి అధిపతి ఎవరో తెలుసా...!
హిందూ సంస్కృతిలో లెక్కలేనంతమంది దేవతలు కనిపిస్తారు. భక్తుల అవసరాలకీ, అభిష్టానికి అనుగుణంగా వారికి ఆదుకోవడంలో ఒక్కో దేవతదీ ఒక్కో ప్రత్యేకత. కేవలం పురాణాలలోనే కాదు, గ్రామీణుల జీవితాలలో కూడా అనేకమంది దేవ
హిందూ సంస్కృతిలో లెక్కలేనంతమంది దేవతలు కనిపిస్తారు. భక్తుల అవసరాలకీ, అభిష్టానికి అనుగుణంగా వారికి ఆదుకోవడంలో ఒక్కో దేవతదీ ఒక్కో ప్రత్యేకత. కేవలం పురాణాలలోనే కాదు, గ్రామీణుల జీవితాలలో కూడా అనేకమంది దేవీదేవతల గురించిన నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. తమ గ్రామాలను కాచుకుంటారని, నిర్మలమైన తమ జీవితాలకి అండగా నిలబడతారని ఇలాంటి గ్రామదేవతలను కొలుచుకుంటారు.
అలా తమిళనాడులో ప్రసిద్ధమైన గ్రామదేవతే సుదలై మదన్. ఈ దేవత పేరు మీదుగానే తమిళనాట మనకు చాలామంది మదన్ అనే పేరుతో తారసిల్లుతూ ఉంటారు. సుదలై మదన్ గురించి ప్రాచీన గ్రంథాలలో ఎక్కడా ప్రస్తావన కనిపించదు. ఈయన పుట్టక, మహత్మ్యం గురించిన కథనాలు కుప్పలు తెప్పలుగా వినిపిస్తుంటాయి. వాటిలో ఒక కథ ప్రకారం కైలాసంలోని పార్వతిదేవి ఒకనాడు చాలా దీనంగా ఉందట.
పరమేశ్వరుడు ఆమె నిస్తేజాన్ని కారణం అడగగా... తనకు ఒక బిడ్డ ఉంటే బాగుండు అన్న కోరికను వ్యక్తం చేసిందట పార్వతీదేవి. మనకి ఇప్పటికీ ఇద్దరు కుమారులు.. వినాయకుడు, సుబ్రమణ్యేశ్వరుడు ఉన్నారు కదా అని శివుడు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా పార్వతీదేవి తన పంతాన్ని వీడలేదు. దాంతో ఒక మహజ్యోతి ముందర నిలబడి తపస్సు చేస్తే ఆమె కొంగులో బిడ్డను ప్రసాదిస్తానంటూ శివుడు అనుగ్రహించాడు.
భర్త చెప్పినట్టే పార్వతీదేవి బిడ్డ కోసం తపస్సుని ఆచరించడం మొదలుపెట్టింది. త్వరలోనే ఆమె కొంగున ఒక శిశువు కనిపించాడు. కానీ దురదృష్టకరం. ఆ మాంసపు ముద్దకి ఎలాంటి ఆకారమూ లేదు. నీ మనసులో ఒక పక్కనన్ను పరీక్షించాలనే కోరిక ఉండడంతో ఈ వరాన్ని కోరుకున్నావు. అందుకే నీకు లభించిన శిశువు కూడా అసంపూర్ణంగా ఉన్నాడు అంటూ జరిగిన దానికి కారణాన్ని వివరించాడు పరమేశ్వరుడు. పార్వతీదేవికి జరిగిన భంగపాటు గురించి తెలుసుకున్న బ్రహ్మ మనసు కరిగిపోయింది. వెంటనే ఆ మాంసపు ముద్దకు ఒక చక్కటి రూపుని ఇచ్చేందుకు ముందుకి వచ్చాడు. అలా బ్రహ్మ చేతిలో రూపుదిద్దుకున్న పార్వతీ తనయుడే సుదలై మదన్ అని తమిళురు నమ్ముతారు.
సుదలై మదన్ కథ ఇక్కడితో ఆగిపోలేదు. సుదలై పెరుగుతున్న కొద్దీ ఆయన ఆకలి కూడా అంతకంతకూ పెరిగిపోసాగింది. తన ఆకలిని తీర్చుకునేందుకు కాలుతున్న శవాలను సైతం ఆరగించసాగాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి అతనికి కైలాసంలో ఉండేందుకు అర్హుడు కాదని, ఇక మీదట భూమి మీదే సంచరిస్తూ ఉండాలని ఆదేశించిందట. ఆ ఆదేశాన్ని మన్నించిన సుదలై భూమి మీదకి వెళ్ళే ముందు పార్వతిని కొన్ని వరాలు కోరుకున్నాడట. తన విభూతిని రాసుకున్న వారికి ఎలాంటి అనారోగ్యమైనా దూరం కావాలని, భక్తులు తనని కోరుకునే ఏ కోరిక అయినా వెంటనే నెరవేరాలనీ తన ఉన్న చోట దుష్టశక్తులు అడుగుపెట్టకూడదనీ.. తన తల్లిని అభ్యర్థించాడు. సుదలై మాటకి పార్వతీదేవి అంగీకారం తెలుపడంతో ఆయన అప్పటినుంచీ మరుభూమిని తన నివాసంగా మార్చుకున్నాడని అంటారు.
తమిళ ప్రజలు నిజంగానే సుదలై మదన్ తమను ఎలాంటి రోగాల నుంచైనా కాపాడతాడని నమ్ముతారు. ఆయన చల్లని చూపు తమ గ్రామాన్ని రక్షిస్తుందని, స్మశానం నుంచి ఎలాంటి దుష్టశక్తి తమ ఇళ్ళలోకి ప్రవేశించకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు. తిరువన్వేలి జిల్లాలో ఉన్న సీవలప్పెరై అనే గ్రామంలో అయితే సుదలై మదన్ విభూది కింద దగ్గరలో ఉన్న స్మశానంలోని మట్టిని తీసుకువచ్చి ఇస్తారు. తమిళురు అధికంగా కనిపించే మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలలో కూడా సుదలై మదన్ ఆరాధన కనిపిస్తుంది.