సృష్టి ఎందుకు పరిపూర్ణంగా కనిపించదో తెలుసా..!
పరిపూర్ణుడైన భగవంతుడు తన సృష్టిని దోషరహితంగా ఎందుకు మలచడం లేదు? అదే మన వాక్కును, మనసుకు ఇంకా అందరి రహస్యం. లోపం అనేది మనిషి మనిషికీ మారే విశేషణం. ఒకరు ద్వేషించింది మరొకరు ఇష్టపడతారు.
పరిపూర్ణుడైన భగవంతుడు తన సృష్టిని దోషరహితంగా ఎందుకు మలచడం లేదు? అదే మన వాక్కును, మనసుకు ఇంకా అందరి రహస్యం. లోపం అనేది మనిషి మనిషికీ మారే విశేషణం. ఒకరు ద్వేషించింది మరొకరు ఇష్టపడతారు. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు కలిగించవచ్చు. ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోవాల్సింది ఎవరికి వారే! అడవుల్లో నివసిస్తూ తపోధ్యానాదులు ఆచరించే శుద్ధ సాత్వికులైన మునుల్ని రాక్షసులు వేధించేవారట. కారణం.. అది వారి నైజం కావడమే!
సాక్షాత్ భగవంతుడే ఓ అవతార పురుషుడిగా ఆవిర్భవించినా ఆయనను ద్వేషించేవారు పుట్టారు, పుడతారు. భార్యను అనుమానించిన ఒక వ్యక్తికి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడిలోనే లోపాలు కనిపించాయట. షోడశ కళాప్రపూర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మలో ద్వేషించదగిన అంశాలే ధార్తరాష్ట్రాదులకు గోచరించాయి. జరాసంధుడికి శ్రీకృష్ణుడిలో అల్పత్వమే కనిపించింది. లోక కళ్యాణం అంటేనే ఓర్వలేని కొందరు మతం పేరిట ఉగ్రవాదులుగా మారి మారణకాండకు పాల్పడటం మనందరికీ తెలిసిన కిరాతకమే!
పరిపూర్ణత సిద్ధాంతాన్ని నమ్మేవారు కొందరు ఉంటారు. వారు ప్రతి ఒక్కటీ దోషరహితంగా చేయాలని సంక్పలిస్తారు. చేసే పని, తినే తిండి ఇతరుల మనస్తత్వాలు, ఆచరించే విధానాలు అన్నీ పూర్తి పరిపూర్ణంగా ఉండాలనుకుంటారు. తాము ఆశించిన విధంగా లోకం లేనప్పుడు - శారీరక, మానసిక ఒత్తిళ్ళులోనై బతుకును భారం చేసుకుంటారు. మరికొందరు పుడుతూ గిడుతూ తరచూ మార్పులకు లోనవుతుంటుంది జగత్తు. ఇది పరిపూర్ణం కాదు. పరిపూర్ణుడు ఒక్క భగవంతుడే!
తోటివారిలోని లోపాలను వేలెత్తి చూపడమే మనిషి పని కాకూడదు. అవకాశం ఉన్నప్పుడు సంస్కరించాలి. తాను ఇతరుల్లో చూస్తే లోపాలు తనలో లేవని నిర్ధారణ చేసుకోవడం అతడికి, సమాజానికి మంచిది. ఎవరూ పరిపూర్ణులు కారు. ఆ ఆంతర్యామి తప్ప. తప్పులు అందరూ చేస్తారు. క్షమించగల మనస్తత్వమే విలువైన సుగుణం అని మనిషి గ్రహించాలి. సర్దుకుపోవడంలోనే మానవత్వం దాగి ఉంది. విశ్వకళ్యాణం ఉంది. సమాజం మారాలంటే మొదట మనం మారాలి. లోపాల్ని తొలగించుకుంటూ, మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేయడమే అంతర్యామి హర్షించే నిజమైన పరిపూర్ణత. ఆ కోణంలో తన సాధనను సంపూర్ణం చేసుకున్న వ్యక్తే - మనిషి, పరిపూర్ణుడు.