Publish Date: Fri, 23 Nov 2018 (13:34 IST)
Updated Date: Fri, 23 Nov 2018 (13:36 IST)
ఇంట్లో పూజా సమయంలో లేదా ఆలయాలకు తీసుకెళ్లిన కొబ్బరికాయ కొట్టినపుడు కొన్నిసార్లు కుళ్లిపోయి ఉంటుంది. ఇలా జరగడం అరిష్టంగా కొందరు భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇపుడు తెలుసుకుందాం.
పూజా సమయం లేదా ఆలయంలో దైవ సన్నిధిలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లి (మురిగి) పోయి, అందులో నీళ్లు లేకుండా ఉంటుంది. దీంతో చాలామంది కంగారుపడిపోతారు. దైవానుగ్రహం కోసం చేసే పూజలో ఇలా అయిందేంటనే భయం వారిని వెంటాడుతుంది. పైగా, ఇలా జరగడం అశుభ సూచకంగా భావిస్తారు.
సాధారణగా కొబ్బరి కాయ కూడా కుళ్ళిపోవడం సహజం. దాన్ని అశుభ సూచకంగా భావించనక్కర్లేదు. ఒకవేళ కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోయి ఉంటే... 'కాయ కుళ్లిపోలేదనీ కుళ్ళు పోయిందనీ' పెద్దలు చమత్కరిస్తుంటారు. అంటే మనకు జరగబోయే కీడు తొలగిపోయిందని అంటారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే కీడు కలుగుతుందనుకోవడం అదొక మానసిక బలహీనతగా భావించాలే తప్ప మరోలా అనుకోకూడదు.
శాస్త్రాలలో, పురాణాలలో ఎక్కడా ఇందుకు ఆధారాలు లభించవు. మనం కొలిచే ఇష్టందైవంపై చలించని నమ్మకం ఉంటే ఇలాంటి సందేహాలు ఉత్పన్నంకావని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోయినా... నీళ్లు లేకపోయినా ఎలాంటి అశుభం జరగదని, నిశ్చింతగా ఉండొచ్చని వారు చెబుతున్నారు.