షిరిడి సాయిబాబా అనుగ్రహం... భక్తుల విశ్వాసం....
షిరిడీ సాయిబాబా అంటే భక్తులకు అనంతమైన అనురాగం, అపారమైన విశ్వాసం. ఆయన కొలువుతీరిన ఆలయాలు అందుకు నిదర్శనంగా దర్శనమిస్తుంటారు. తనని విశ్వసించేవాళ్లని ఎన్నివిధాలుగా కాపాడాలో అన్నివిధాలుగా కాపాడుతూ వచ్చినవ
Publish Date: Thu, 12 Jul 2018 (15:15 IST)
Updated Date: Thu, 12 Jul 2018 (17:04 IST)
షిరిడీ సాయిబాబా అంటే భక్తులకు అనంతమైన అనురాగం, అపారమైన విశ్వాసం. ఆయన కొలువుతీరిన ఆలయాలు అందుకు నిదర్శనంగా దర్శనమిస్తుంటారు. తనని విశ్వసించేవాళ్లని ఎన్నివిధాలుగా కాపాడాలో అన్నివిధాలుగా కాపాడుతూ వచ్చినవారే సాయిబాబా. తన భక్తులు ఆ బాధలను భరించలేరని భావించినప్పుడు ఆ బాధలను తాను స్వీకరించిన సందర్భాలు ఎన్నోవున్నాయి.
ఎలాంటి కష్టమైనా, ఎంతటి సమస్యనయినా బాబాతో చెప్పుకుంటే తీరిపోతుందనే విశ్వాసం నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగానే గురువారం వచ్చిందంటే చాలు ఆయన ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తుంటాయి. సాధారణంగా బాబాకి భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేస్తుంటారు. ఆయన పాదాల చెంత శిరస్సును వంచి నమస్కరిస్తుంటారు. ఆయన విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.
గురువు యొక్క పాదాలను ఆశ్రయించడం వలన సమస్త పుణ్యతీర్థాలను దర్శించిన ఫలితం లభిస్తుంది. ఆ పాదాలకు నమస్కరిస్తూ ప్రదక్షణలు చేయడం వలన సమస్త దేవతలకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది. ఆయన అనుగ్రహానికి ప్రతీకగా చెప్పబడే విభూతి ధారణ అన్నింటి నుండి కాపాడుతూ ఉంటుంది. ఇక తన సన్నిధిలో అడుగుపెట్టినవారిని బాబా చిరునవ్వుతో అనుగ్రహించకుండా ఉండడు.
బాబాకి ప్రదక్షణలు చేయడం వలన ఆయన పాదాలకు నమస్కరించడం వలన విభూతి ధారణం వలన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఆయన ఆశీస్సుల వలన ఆనందకరమైన జీవితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. అందుకే బాబా కొలువైన ప్రతి మందిరం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటుంటారు.