కార్తీకమాసం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివావిష్ణువుల పూజ ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అక్టోబర్ 22, 2025న కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతీ రోజూ పండగే. అందుకే ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అలాగే కార్తీకమాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కంధ పురాణం చెప్తోంది. అందుకే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి త్రిమూర్తులను ధ్యానించి.. దీపారాధన చేయాలి. ఉదయం, సాయంత్రం పూట పూజ తప్పనిసరిగా చేయాలి. నైవేద్యం సమర్పించి ఉపవాసాన్ని ముగించి ప్రసాదాన్ని స్వీకరించాలి. తద్వారా పాపాలు హరించుకుపోయి.. మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
అలాగే కార్తీక మాసంలో దీపదానంతో పాటు, నవధాన్యాలు, అన్నం, మంచం దానం చేయడం ఆచారంగా వస్తోంది. కార్తీక వనభోజనాలు చేయడం ద్వారా కుటుంబానికి మేలు జరుగుతుంది. అలాగే కార్తీక సోమవారాల్లో వ్రతమాచరించడం పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది.
సోమవారానికి చంద్రుడు అధిపతి. అందుకే ఈ రోజున చంద్రపూజ, శివపూజ విశిష్ఠ ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో ఆకాశ దీపం ఆలయాల్లో వెలిగించడం ద్వారా పితృదేవత ఆశీస్సులు పొందవచ్చు.
ఇంకా ఉసిరి దీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. కార్తీక మాసం రెండో రోజైన అక్టోబర్ 23న విష్ణుపూజ చేయడం ఉత్తమం. విష్ణుపూజ కోసం రెండు నేతి దీపాలు వెలిగించడం ద్వారా కుటుంబంలో ఐక్యత చేకూరుతుంది. ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీకంలో వచ్చే సోమవారాలు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి పవిత్రమైన రోజులని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.