Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తిలో నేతి దీపాల మోసం... ప్రైవేట్ వ్యాపారుల నిలువు దోపిడీ

కార్తీక మాసం వచ్చిందంటే శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న ప్రైవేటు వ్యాపారులకు పంట పండినట్లే. నేతి దీపాల పేరుతో భక్తులను నిలువునా మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ నేతి దీపాలు ఆలయ ఆవరణంలో వెలిగిస్

శ్రీకాళహస్తిలో నేతి దీపాల మోసం... ప్రైవేట్ వ్యాపారుల నిలువు దోపిడీ
, శుక్రవారం, 18 నవంబరు 2016 (11:33 IST)
కార్తీక మాసం వచ్చిందంటే శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న ప్రైవేటు వ్యాపారులకు పంట పండినట్లే. నేతి దీపాల పేరుతో భక్తులను నిలువునా మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ నేతి దీపాలు ఆలయ ఆవరణంలో వెలిగిస్తుండడంతో ఈ ప్రాంత మంతా పొగ కమ్ముకుపోతోంది. ఈ విషయమై దేవస్థాన అధికారులు పట్టించుకోకపోవడంతో కల్తీ నేతిదీపాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ సారి కూడా అదే జరుగుతోంది.
 
కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం మహిళలు నేతి దీపాలు వెలిగిస్తే మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉండటంతో ఈ మాసంలో అధిక సంఖ్యలో భక్తులతో పాటు, స్థానికులు దీపాలు వెలిగించేందుకు శ్రీకాళహస్తీశ్వరాలయానికి బారులు తీరుతున్నారు. సోమవారం నాడు వందల సంఖ్యలో మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు నిలువునా దోపిడీ చేసేస్తున్నారు. ఆలయ ఆవరణలో పలు ప్రైవేట్ వ్యాపారాలు వెలసి ఉన్నాయి. ఇక్కడ నేతి దీపాల పేరుతో విక్రయాలు జరుగుతున్నాయి. 
 
చిన్న డబ్బా నెయ్యి, ఒక వొత్తుల ప్యాకెట్‌, అగ్గిపెట్టి, ప్రమిదను భక్తులకు 40 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వ్యాపారుల నెయ్యి డబ్బా అని చెబుతున్నా అందులో డాల్టా ఉంటుంది. చిన్న డబ్బా డాల్డా బయట మార్కెట్‌లో 10లోపే ఉంది. దీనికి తోడు వొత్తుల ప్యాకెట్‌ 5 రూపాయలు, 1 రూపాయి ప్రమిద, 2 రూపాయలు మొత్తం కలిసి వ్యాపారులకు 20లోపే అవుతుంది. 
 
అయితే నెయ్యి దీపాల పేరుతో భక్తుల నుంచి ఒక్కో దీపాన్ని 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎంతో భక్తితో ఆలయానికి విచ్చే భక్తులు విధిలేక అధిక ధరలకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ మోసం నిత్యం జరుగుతున్నా ఆలయాధికారులుగానీ, పాలకమండలి గానీ పట్టించుకున్న పాపానపోలేదు. ఫలితంగా భక్తులు నిత్యం మోసాలకు గురవుతున్నారు. వ్యాపారులు మాత్రం వేల రూపాయలను సొమ్ము చేసుకుని పబ్బం గడుపుతున్నారు.
 
శ్రీకాళహస్తీశ్వరాలయం ఆవరణలోని పోటు ఎదురుగా అధికంగా నేతి దీపాలను వెలిగిస్తున్నారు. వాస్తవానికి కల్తీ నేతి దీపాలనే ఇక్కడ వెలిగిస్తుండడంతో ఆలయ ఆవరణం అంతా పొగ కమ్ముకుపోతోంది. ఫలితంగా ఈ ప్రాంతమంతా కాలుష్యం అలుముకుంటోంది. ఆలయాధికారులు ఇప్పటికైనా స్పందించి కల్తీ నేతి దీపాలు విక్రయిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుని కాలుష్యం నుంచి ఆలయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 నిమిషాల్లో తిరుమల వేంకటేశుడి దర్శనం... అంతా మోదీ పెద్దనోట్లు రద్దు మహిమ...