Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరిగింది. ఆదివారం ఉదయం 7 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుక

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
, ఆదివారం, 16 జులై 2017 (16:25 IST)
శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరిగింది. ఆదివారం ఉదయం 7 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.
 
పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చారు. చిన్న జీయంగార్‌, తితిదే ఈవో, జేఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. శ్రీవారి మూలవిరాట్టుకు ఈ వస్త్రాలను సమర్పించారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ''పరివట్టం'' (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షణ స్వీకరించి 'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు.  
 
హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. సాధారణంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. 
 
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమైయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చారు. అయినా శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరుగుతుండడం విశేషం. 
 
అణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా జులై 16వ తేదీ ఆదివారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 నుండి 7 గంల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు తిరుమల పురవీధుల గుండా అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలితాలు(16-07-2017)... నిరుద్యోగులకు జయం...