Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివర ఆస్థానం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివర ఆస్థానం
, గురువారం, 16 జులై 2020 (22:23 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో గురు‌వారంనాడు సాలకట్ల ఆణివర ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్ద జీయంగార్‌స్వామి, చిన్న జీయంగార్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
        
ముందుగా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. 
 
అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్‌ పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. 
 
చిన్న జీయంగార్‌, ఛైర్మన్‌, ఈవో, అద‌న‌పు ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంటవచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. 
 
ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. అనంతరం ఆస్థానం ముగిసింది. శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ  ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలు సమర్పించారు. 
 
గురు‌వారం ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  
 
వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు:
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్‌ నెలలకు మార్చారు.
 
ఈ సంద‌ర్భంగా టిటిడి ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది శ్రీవారి ఆల‌యంలో నిర్వ‌హించే సాల‌క‌ట్ల ఆణివార ఆస్థానంను శాస్త్రోక్తంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ‌రంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌యం నుండి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించార‌న్నారు. శ్రీ‌వారి ఆల‌యంలో నిత్య కైంక‌ర్య‌లు, ఉత్స‌వాలు, నిత్యం ప్ర‌తి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి తీసుకున్న చ‌ర్య‌లు, భ‌క్తుల స‌హాకారంతో ద‌ర్శ‌నాలు కొన‌సాగుతున్నాయ‌న్నారు. శ్రీవారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆయురారోగ్యాల‌తో ఉండాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణమాసం రాబోతోంది, లక్ష్మీదేవిని అలా ఆరాధిస్తే...?