Publish Date: Thu, 16 Oct 2014 (17:26 IST)
Updated Date: Thu, 16 Oct 2014 (17:29 IST)
హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.