Publish Date: Mon, 22 Apr 2019 (16:46 IST)
Updated Date: Mon, 22 Apr 2019 (18:12 IST)
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, యాక్సిండెంట్లు జరగడం, పిల్లలలో దుష్ప్రవర్తన, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంటాయి.
అలాగే కెరీర్లో అభివృద్ధి లేకపోవడం, ప్రారంభించిన కార్యాలు పూర్తికాకపోవడం ఇలా మీరు ఇక్కట్లు పడుతున్నట్లయితే మీకు పితృదోషం ఉండవచ్చు. వెంటనే పితృదోష నివారణ చేయించవలసి ఉంటుంది.
పితృదేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే, పరిహారం కోసం మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు.
పితృదోషాలు ఉన్నవారు తిలతర్పణపురి గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయాన్ని దర్శిస్తే దోషాలు పోతాయట. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్ధించాడు.
శివుడు ప్రత్యక్షమై ఈ ఊరులోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలతర్పణపురి అయింది.
తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. రాముడు తిలలు వదిలిన స్థలం ఇది. రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది.
అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.
ఇక్కడ నరముఖంతో ఉన్న గణపతి దర్శనమిస్తాడు. గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. ఇటువంటి గణపతి ఆలయం చాలా అరుదుగా ఉంటుంది.
ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధిపొందింది. తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయంకు 25 కి.మీ దూరంలో, కూతనూరు సరస్వతీ ఆలయంకు 3 కి.మీ దూరంలో ఈ ఆలయం ఉంది.