Publish Date: Thu, 02 Jan 2020 (16:00 IST)
Updated Date: Thu, 02 Jan 2020 (16:00 IST)
జనవరి 8వ తేదీన ప్రదోషం. ఆ రోజున త్రయోదశి నాడు సాయంత్రం నాలుగున్నర నుంచి అర్థరాత్రి వరకూ ప్రదోషకాలంగా పరిగణించవచ్చు. సూర్యాస్తమయానికి ముందు రెండున్నర ఘడియలూ సూర్యాస్తమయం తర్వాత రెండున్నర ఘడియల కాలాన్ని కలిపి ప్రదోషం అంటారు. ప్రదోష కాలానికి ముందుగా స్నానం చేసి శివారాధన చేయాలి. ప్రదోష సమయంలో శంకరుడు అమ్మవారితో కలిసి ఆనంద తాండవం చేస్తాడు.
ఆ సమయంలో స్వామి ఆనంద తాండవం చేస్తున్న దివ్య మంగళ నటరాజ రూపాన్ని కొలిస్తే సర్వపాపాలూ హరిస్తాయి. మహాశివుడు అభిషేక ప్రియుడు కనుక మంత్రోక్తంగా పంచామృతాలతో ఆయనను అభిషేకించాలి. ఇది వీలు పడని వారు ఆలయానికి వెళ్ళి ప్రదోష సమయంలో అభిషేకం చేయించవచ్చు.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్నే ప్రదోష కాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితో అది ప్రదోష కాలం. ప్రదోష కాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఈ సమయంలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వర రూపంగా దర్శనమిస్తాడు.
ఆనంద తాండవాన్ని చేస్తాడు. పరమశివుడు ప్రదోషకాలంలో పార్వతీ సమేతుడై ప్రమధ గణాలతో కొలువై అత్యంత ప్రసన్నమూర్తిగా భక్తులు కోరిన కోర్కెలన్నింటినీ నెరవేరుస్తాడు. ప్రదోష సమయంలో పూజించిన వారికి గ్రహదోషాలు, ఇతర పాపాలు వ్యాధుల నుంచి విముక్తులవుతారని పండితులు చెప్తున్నారు.