Publish Date: Wed, 18 Sep 2019 (17:05 IST)
Updated Date: Thu, 19 Sep 2019 (14:05 IST)
వినాయకుడిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గణపతిని గన్నేరు పూలను వినాయక చతుర్థి రోజున పూజకు ఉపయోగించడం వల్ల అష్టకష్టాలు తొలగిపోతాయి. ఉదయం పూట తెల్ల గన్నేరు పూలతో శివుడు, గణేశుడికి అర్చన చేస్తే కోరుకున్నవి సిద్ధిస్తాయి.
అర్చక పుష్పం పేరుతో పిలిచే గరికతో విఘ్నేశ్వరుడిని పూజిస్తే సమస్త దోషాలు, విఘ్నాలు తొలగిపోతాయి. ఇది సూర్యుడికి కూడా ప్రీతికరమైంది కావడంతో ఆరోగ్యం ప్రాప్తిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
అంతేకాదు గణేశుడికి దూర్వార పత్ర పూజ చేస్తే శనీశ్వరుడు వల్ల కలిగే కష్టాల నుంచి బయటపడతారు. శనివారం నాడు శనిదేవుని గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, దీంతో శ్రీ మహాగణపతిని పూజించి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే చేపట్టిన పనులు త్వరగా సానుకూలమవుతాయి. అదీ వినాయక చవితి రోజున గరిక పూజతో విశిష్ట ఫలితాలను పొందవచ్చు.
అలాగే వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పాదరస గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది. వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పాదరస గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది.
పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా రూపొందించుకుని పాదరస లక్ష్మీగణపతిని పూజిస్తే.. ఆర్థిక ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీగణపతి పూజతో వ్యాపారంలో లాభాలు పొందవచ్చునని పండితులు సూచిస్తున్నారు. పాదరస గణనాథుడిని పూజించిన వారికి సంపద చేకూరుతుంది. కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
ఇంకా విజయానికి వున్న అడ్డంకులు తొలగిపోతాయి. గణపతి జ్ఞానానికి ప్రతీక. ఆ గణనాథుడిని పాదరసంతో కూడిన ప్రతిమ ద్వారా పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.