హోలీ రోజునే శ్రీలక్ష్మి జయంతిని జరుపుకుంటారు. ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పూజను చేయడం సర్వ విధాల శుభాలను ప్రసాదిస్తుంది. అదేరోజు శ్రీలక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఉద్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ లక్ష్మీదేవి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించి గులాబీలతో, పారిజాతపూలతో అర్చించాలి. ఆవునేతితో దీపారాధన చేసి క్షీరాన్నం నివేదించాలి.
పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తరువాత కనీసం ఒక్క ముత్తైదువుకు అయినా తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా లక్ష్మి పూజ చేస్తే ఐశ్వర్యం చేకూరుతుందని నమ్మకం. అలాగే ఈరోజు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని ప్రతీతి. శుక్రవారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు ఇంట్లో నలుమూలలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నరదృష్టి కారణంగా ఏర్పడే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
అలాగే ఈ రోజు ఇంటి ఇల్లాలు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయడం వలన కూడా దృష్టి దోషాలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయి. పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చిన రోజు దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది.
అంతేకాదు ఈ రోజు దుర్గాదేవికి నిమ్మకాయల దండ సమర్పించి ఆలయంలోనే దేవీఖడ్గమాలా స్తుతి చదువుకుంటే అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయని శాస్త్రవచనం.
ఆవు నేతితో తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించాలి. అలాగే, కనకధారా స్తోత్రం, శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం, మణిద్వీప వర్ణన, శ్రీసూక్తం, మహాలక్ష్మష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం వంటివి పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతుంది.