Publish Date: Sat, 17 Nov 2018 (11:04 IST)
Updated Date: Sat, 17 Nov 2018 (11:06 IST)
కార్తీక ప్రదోషం.. 20వ తేదీన వస్తోంది.. ఈ రోజున శివాలయాల్లో నందీశ్వరుడికి జరిగే అభిషేకాలను దర్శించుకోవడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. సమస్త దోషాలు తొలగిపోతాయి. నవంబర్ 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈశ్వరుని ఆలయంలో నందీశ్వరుడికి, శివలింగాలకు జరిగే అభిషేకాలు అలంకారాలను కనులారా వీక్షించే వారికి మరుజన్మంటూ వుండదు.
అలాగే ఈ సమయంలో పాలు, పెరుగు, పనీర్, పుష్పాలు స్వామి వారికి అభిషేకానికి అందజేస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ.. ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగలంలో పరమేశ్వర రూపంగా అర్థనారీశ్వరుడిగా దర్శనమిస్తాడు.
ఆ ప్రదోష సమయంలో అమ్మవారు అధ్యక్షురాలిగా అధిరోహించి వుంటుంది. పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తుంటాడు. ఆ నృత్యాన్ని దర్శించేందుకు దేవతలందరూ కొలువై వుంటారు. ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీ దేవి వీణ వాయిస్తూ వుంటే బ్రహ్మ తాళం వేస్తుంటాడు. శ్రీ మహాలక్ష్మీ దేవి గానం చేస్తుంటే.. శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తాడట. దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ వుంటారట.
అందుకే ప్రదోష సమయంలో పరమేశ్వరుడిని దర్శించుకుంటే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుందని విశ్వాసం. శివున్ని ప్రదోష కాలంలో ఆరాధిస్తే.. శివుని ఆశీస్సులతో పాటు మిగిలిన దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో పొందవచ్చు.
అర్థనారీశ్వర స్వామిగా ప్రదోషకాలంలో దర్శనమిచ్చే ఈశ్వరుడిని పూజిస్తే.. కామాన్ని నియంత్రింటే శక్తి.. కాలాన్ని జయించే శక్తిని పొందవచ్చు. ఇంకా ప్రదోషంలో శివ దర్శనం సర్వశుభాలను కలుగ చేస్తుంది. సర్వ దారిద్ర్యాలు, ఈతిబాధలను తొలగించి.. సర్వసంపత్తులు అనుగ్రహిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.