Publish Date: Wed, 26 Aug 2020 (05:08 IST)
Updated Date: Wed, 26 Aug 2020 (10:55 IST)
బుధవారం (ఆగస్టు 26, 2020) శుక్లపక్ష అష్టమి తిథి. ఈ రోజున అనురాధ నక్షత్రం. ఈ రోజు మొత్తం ఎలాంటి శుభకార్యాలు చేపట్టకపోవడం మంచిది. సాధారణంగా అష్టమి తిథిన శుభకార్యాలు జరపకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
అందుకే అష్టమి తిథి వచ్చే బుధవారం పూట శుభకార్యాలను నిర్వహించకపోవడం మంచిది. భాద్రపద, శుక్లపక్ష, అష్టమి రోజున కాల భైరవునికి దీపమెలిగిస్తే అష్ట దారిద్ర్యాలు తొలగిపోతాయి. రాహు-కేతు, శని దోషాలుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
సాధారణంగా అష్టమి, నవమి తిథుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు.. పెద్దలు. అష్టమి, నవమి రోజుల్లో చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని నమ్ముతారు. పూర్వం అష్టమి, నవమి తిథులు మహావిష్ణువుతో తమ గోడును వినిపించుకున్నాయట.
అష్టమి, నవమిల్లో ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేపట్లేదని అవి వాపోయాయట. ఆ సమయంలో విష్ణు భగవానుడు.. అష్టమి, నవమి తిథులను ప్రజలు గుర్తించే రోజు వస్తుందని హామీ ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి.
దీని ప్రకారం వాసుదేవుడు- దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథిలో కృష్ణుడు జన్మించాడు. ఆ రోజు శ్రీ కృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు. ఇక నవమి తిథిలో దశరథుడు-కౌసల్య దంపతులకు కుమారుడిగా శ్రీరాముడు జన్మించాడు. రామనవమి రోజున కూడా ప్రజలు పండగ చేసుకుంటారు. కానీ నవమిలో జన్మించిన రాముడు అరణ్య వాసం చేశాడు. ఇంకా సీతమ్మను విడిచి తీవ్ర దుఃఖాన్ని అనుభవించాడు.
ఇందుకు నవమి తిథిలో జన్మించడమే కారణం. అందుకే నవమి తిథిలో శుభకార్యాలు ప్రారంభించరు. అయితే దైవ కార్యాలకు మాత్రం ఈ తిథి ఉత్తమం. ఇకపోతే.. అష్టమిలో జన్మించిన కృష్ణుడు కూడా తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత వద్ద ముద్దుగా పెరిగినా.. కంసునిచేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఈ రెండు తిథులు శుభకార్యాలకు ఉత్తమమైనవి కావని పండితులు చెప్తున్నారు.