శ్రీ కాత్యాయని దేవి అలంకారం(05-10-2016), రాక్షసత్వాన్ని నశింపజేస్తుంది...
‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతినీ’ శరన్నవరాత్రి మహోత్సవాలలో తిథుల హెచ్చుతగ్గుల వలన ఒక్కొక్కసారి 11 రోజులు అలంకారము చేయవలసి వస్తుంది. ఈ దుర్మఖ నామ సంవత్సరం అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు కాత్యాయనిదేవిగా
Publish Date: Wed, 05 Oct 2016 (12:49 IST)
Updated Date: Wed, 05 Oct 2016 (12:54 IST)
‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతినీ’
శరన్నవరాత్రి మహోత్సవాలలో తిథుల హెచ్చుతగ్గుల వలన ఒక్కొక్కసారి 11 రోజులు అలంకారము చేయవలసి వస్తుంది. ఈ దుర్మఖ నామ సంవత్సరం అమ్మవారిని ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు కాత్యాయనిదేవిగా అలంకరించి పూజిస్తున్నారు. సింహ వాహనంపై అధిరోహించి కరవాలం చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్రక్షణిగా నేడు కాత్యాయనీ దేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణియై విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలందుకుంటుంది.
పూర్వం ‘కత’ అనే మహర్షి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. అతనికి ‘కాత్య’ అనే పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవర్చుకున్న ఆయనకే ‘కాత్యాయునుడు’ అని పేరు వచ్చింది. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేస్తాడు. దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. కాత్యాయనిని పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరు గాంచింది.
మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరియు త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయనీ దేవికి శక్తిని ప్రసాదించి లోకకల్యాణం గావించారు. అనేకమంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయనీదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయి. రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి. రవ్వకేసరి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.