కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఐదేళ్లు నిండని చిన్నారులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే అత్యాచార నిందితులను శిక్షించేందుకు కఠిన శిక్షలు ఇంకా అమలులోకి రాలేదు. అందుకే అత్యాచారాలు, ఆపై హత్యలకు పాల్పడుతున్న కీచకులు ఇంకా జైలు జీవనంలో గడుపుతున్నారు.
కొన్ని కఠిన చట్టాలు వచ్చినా అత్యాచార ఘటనలు మాత్రం ఆగట్లేదు. అయితే లక్నోలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు అత్యాచార నిందితుడిని పట్టుకుని తాట తీశారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేసేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపక్ వర్మ అనే వ్యక్తి మూడేళ్ల పసిపాపను అపహరించి, అత్యాచారం చేశాడు.
గురువారం తెల్లవారుజామున, రద్దీగా ఉండే ఐఎస్బీటీ, మెట్రో ప్రాంత సమీపంలోని ఒక వంతెన కింద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనపడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పాపను అపహరించిన ప్రదేశానికి సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని దారిన పోయే ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.
ప్రస్తుతం బాలికకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం నాటికి కూడా ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయితే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దీపక్ వర్మ వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో వర్మ తీవ్రంగా గాయపడగా, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 20 గంటల్లోనే నిందితుడిని గుర్తించి, పట్టుకోవడం గమనార్హం. నిందితుడిపై నేర చరిత్ర వుంది. వర్మపై లక్నోలోని పలు పోలీస్ స్టేషన్లలో గతంలోనే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, అతను పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు.