భారత ఎన్నికల సంఘం కొత్త ప్రధాన కమిషనరుగా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ గుప్తా కుటుంబ సభ్యలంతా ఐఏఎస్లు, వైద్యులు కావడం గమనార్హం. ఈయన ఇంట్లో ఏకంగా 28 మంది వైద్యులు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా.. కానీ, ఇదే నిజం. అలాగే, నలుగురు ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఐఆర్ఎస్ అధికారులు కూడా ఉన్నారు. పైగా, ఆయన ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు కూడా ఐఏఎస్ అధికారులే కావడం గమనార్హం.
ఈయన పెద్ద కుమార్తె మేధా రూపం. ఆమె భర్త 2014కు చెందిన ఐఏఎస్ అధికారి. మేధా ప్రస్తుతం యూపీలోని కాస్గంజ్ జిల్లా కలెక్టరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త మనీశ్ బన్సల్ యూపీలోని సహరన్ పూర్ కలెక్టరుగ సేవలు అందిస్తున్నారు. ఆయన రెండో కుమార్తె అభిశ్రీ ఒక ఐఆర్ఎస్ అధికారిణి. ఆమె భర్త అక్షయ్ లబ్రూ ఒక ఐఏఎస్ ఆఫీసర్.
జ్ఞానేశ్ సోదరుడు మనీశ్ కుమార్ ఐఆర్ఎస్ అధికారి. చెల్లి భర్త ఉపేంద్ర జైన్ కూడా ఐపీఎస్సే. మనీశ్ సోదరి రోలి ఇండోర్లోని ఒక పాఠశాల నడుపుతున్నారు.జ్ఞానేశ్ పుట్టింది యూపీలోని ఆగ్రాలో. ఆయన తండ్రి సుబోధ్ గుప్తా. తల్లి సత్యవతి. సుబోధ్ గుప్తా సహా ఆయన కుటుంబంలో 28 మంది వైద్యులు ఉన్నట్టు స్థానికులు చెబుతుంటారు.
కాగా, 1988 బ్యాచ్ కేరళ కేడర్కు చెందిన జ్ఞానేశ్ కుమార్ గుప్తా తొలుత తిరువనంతపురం జిల్లా కలెక్టరుగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో 2007 నుంచి 2012 వరకు ఆయన రక్షణ మంత్రిత్వ శాఖలో సంయుక్త రక్షణ కార్యదర్శిగా ఉన్నారు. అప్పట్లో ఇరాక్లో ఐసిఎస్ ఉగ్రమూక హింసాత్మక చర్యలకు తెగబడటంతో అక్కడి నుంచి 183 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు. 2014లో ఆయన ఢిల్లీలో కేరళ ప్రభుత్వ రెసిడెంట్ కమిషనరుగా నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్ స్థానంలో కొత్త ఎన్నికల ప్రధానాధికారిగా నియమితులయ్యారు.