మ్యాన్ ఈటర్ టైగర్ అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో అందరినీ హడలెత్తించిన ఈ టైగర్ అనుమానాస్పదంగా చనిపోయింది. ఈ పులి కళేబరానికి శవపరీక్ష చేయగా, పొట్టలో మహిళ వెంట్రుకలతో పాటు ఆమె చెవి దుద్దులు ఉన్నాయి.
కాగా, ఇటీవల వయనాడ్ జిల్లాలోని మనంతవాడి ప్రాంతంలో ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ అనే కార్మికురాలిపై పులి దాడి చేసి, సగం తినేసింది. అలాగే, ఓ అటవీశాఖ అధికారిపై కూడా ఈ పులి దాడి చేసి గాయపరిచింది. పులి కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో, ప్రభుత్వం ఈ పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించి, చంపేసేందుకు ఆదేశాలిచ్చింది.
అయితే, ఎవరూ ఊహించని రీతిలో పిలకావు ప్రాంతంలో ఓ పాడుపడిన ఇంటి వెనుక ఆ పులి చనిపోయి కనిపించింది. ఆ పులిపై ఉన్న గాయాల ఆధారంగా, మరో క్రూరమృగం దాడిలో ఆ పులి మరణించి ఉంటుందని అంచనాకు వచ్చారు.
కాగా, ఆ మ్యాన్ ఈటర్ పులికి పోస్టుమార్టం నిర్వహించగా... ఆ పులి పొట్టలో చెవిరింగులు, మహిళ దుస్తులు కనిపించాయి. అవి ఇటీవల పులిదాడిలో మరణించిన రాధ అనే మహిళవని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పులికోసం అటవీశాఖ సిబ్బంది వేట కొనసాగిస్తున్న వేళ.. సోమవారం ఉదయం దాని జాడలు కనిపించాయి. అనంతరం పిలకావు ప్రాంతంలో ఓ ఇంటి వెనుక పులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు.