ఐఏఎస్ అధికారి ఒకరు విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీశారు. దీనికి సంబంధించిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పోవాయన్ తాహసీల్కు కొత్త సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ట్రైనీ ఐఏఎస్ అధికారి రింకూసింగ్ నియమితులయ్యారు. మంగళవారం తొలిసారి విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన పట్టణంలో తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు.
అయితే, పబ్లిక్ టాయిలెట్స్ పక్కన కొందరు వ్యక్తులు బహిరంగంగా మూత్ర విసర్జన చేయడాన్ని రింకూ సింగ్ గమనించారు. దాంతో వెంటనే ఆయన అలా చేసిన కొందరితో గుంజీలు తీయించారు. అయితే, తాను బ్రహ్మణడ్ని, మురికిగా ఉన్న ఉన్న పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లలేనని, అందుకే బహిరంగంగా మూత్ర విసర్జన చేసినట్టు ఒక న్యాయవాది చెప్పాడు. అలాగే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు కలిసి తిరుగుతుండటాన్ని రింకూ సింగ్ చూ శారు. పిల్లలను పాఠశాలకు పంపనందుకు ఆ తల్లిదండ్రులతో గుంజీలు తీయించారు.
మరోవైపు, నిరసన చేపట్టిన న్యాయవాదులను రింకూ సింగ్ కలిశారు. అయితే, ఆయనతో మాట్లాడేందుకు న్యాయవాదులు నిరాకరించారు. జనంతో గుంజీలు తీయించడాన్ని నిలదీశారు. తహసీల్ కార్యాలయం, అక్కడి టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని న్యాయవాదులు ప్రశ్నించారు. దీంతో అధికారుల తప్పుగా భావించి రింకూ సింగ్ అందరి ముందు తాను గుంజీలు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.