Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు ఇస్తారా? ఎవరు చెప్పారు?: హెచ్డీ కుమారస్వామి

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు ఇస్తారా? ఎవరు చెప్పారు?: హెచ్డీ కుమారస్వామి

సెల్వి

, గురువారం, 11 జులై 2024 (15:46 IST)
ఐకానిక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా తీవ్రమైన వివాదంగా ఉంది. గత మూడు సంవత్సరాల నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ఉద్యోగులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికతో ముందుకు సాగాలనే తన వైఖరిపై దృఢంగా కనిపించింది.
 
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలో సంకీర్ణ భాగస్వామ్య పక్షంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందన్న ఆశ నెలకొంది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే దాని నిర్ణయంపై.. ఎన్డీయే వెనక్కి తగ్గే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రస్తుత ప్రభుత్వం యు-టర్న్ తీసుకుందని రాసిన ఓ మీడియాపై వైజాగ్‌లో టీడీపీ మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోయారు. అధికారిక ప్రకటన లేకుండా నకిలీ వార్తలను ప్రచారం చేసినందుకు కార్యాలయంపై దాడి చేశారు. 
 
కానీ చాలామంది ఈ దాడిని ఖండించారు. ఎందుకంటే వార్తలు తప్పుగా ఉన్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అన్యాయమని ఫైర్ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైనట్లు పవన్ కళ్యాణ్‌ల, చంద్రబాబులపై వైకాపా విరుచుకుపడింది. 
 
ఈ గందరగోళం మధ్య, కేంద్ర ఉక్కు- భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమార స్వామి బుధవారం విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి, అన్ని వాటాదారులతో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. 
 
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వస్తున్న వదంతులను కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. ప్రైవేటీకరణ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు చేస్తున్న నిరసనపై మీడియా సిబ్బంది అడిగినప్పుడు, మంత్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. "మేము ప్రైవేటీకరించబోతున్నామని ఎవరు చెప్పారు, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రశ్న లేదు. 
 
ఉక్కు కర్మాగారం పునరుద్ధరణ కోసం తాము చూస్తున్నామని, స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి ప్రభుత్వం తరపున ఏదైనా నిర్ణయం ప్రకటించాలంటే ప్రధాని అనుమతి అవసరమని" కుమార స్వామి నొక్కి చెప్పారు. 
 
ఆర్‌ఐఎన్‌ఎల్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు) పునరుద్ధరణ కోసం వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తానని, దానిని అతి త్వరలో ప్రధాని ముందు ఉంచుతానని తెలిపారు. 
 
ఈ ప్లాంట్‌ను సందర్శించిన తర్వాత దేశ జిడిపికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందని, దీనిపై అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని తెలిసిందని ఆయన ఉద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సందేశం ఇచ్చారు. ప్రధానమంత్రి మద్దతుతో ఇది మూసివేయబడకుండా 100% పనిచేస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.
 
తద్వారా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు కేబినెట్‌ మంత్రి హామీ ఊరటనిచ్చింది. అంతేకాకుండా, ప్రైవేటీకరణపై కేంద్రం నుండి అధికారిక ప్రకటన లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్న వైఎస్‌ఆర్‌సిపికి ఈ ప్రకటన చెంపదెబ్బలాంటిది. 
 
ఈ కీలక సమావేశానికి కుమార స్వామితో పాటు ఎంఓఎస్ శ్రీనివాస్ వర్మ కూడా హాజరయ్యారు. వైజాగ్ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ.. అక్టోబర్ 2న బీహార్‌లో ప్రారంభం