Publish Date: Mon, 26 Jul 2021 (15:17 IST)
Updated Date: Mon, 26 Jul 2021 (15:19 IST)
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
రామప్ప దేవాలయం కాకతీయుల అద్భుతమైన నైపుణ్యం అని కొనియాడారు. అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. స్వయంగా శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రసిద్ధ రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు లభించటం పట్ల చాలా సంతోషంగా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశ ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల తరపున ఈ విజయంలో మార్గదర్శకంగా ఉన్న ప్రధానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
పురాతన ఆలయాలకు యునెస్కో ఆదరణపై కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు వల్ల రామప్ప దేవాలయానికి మరింతగా విదేశీ యాత్రికులు వస్తారని, అక్కడ పర్యాటకం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.