ఇటీవల దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు (34) కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన విషయం తెల్సిందే. తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె.రామచంద్రరావు పేరు ఉపయోగించి కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
డీఆర్ఐ అధికారులు ఆమె వద్ద నుంచి 14 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో కీలకపరిణామం చోటుచేసుకుంది. డీఆర్ఐ విచారణలో తరచుగా దుబాయ్ వెళ్లి వస్తూ బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో రన్యారావుపై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. దీంతో వారు త్వరలో రన్యారావును విచారించే అవకాశం ఉంది.
రన్యారావు వద్ద నుంచి ఇప్పటికే రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.17.56 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు అనుమతితో ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్లు, ఫోన్లు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు.
ప్రస్తుతం రన్యారావును డీఆర్ఐ అధికారులు కస్టడీలో ఉంచుకుని విచారిస్తున్నారు. అక్కడ విచారణ పూర్తయిన తర్వాత సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది రన్యారావు కాల్ డేటాలోని వివరాల ఆధారంగా ఢిల్లీ, ముంబైలలో కూడా సీబీఐ అధికారులు విచారణ ప్రారభించినట్టు సమాచారం.