Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రావెన్‌కోర్ రాజ వంశానికే పద్మనాభ ఆలయ నిర్వహణ.. సుప్రీం కోర్టు

ట్రావెన్‌కోర్ రాజ వంశానికే పద్మనాభ ఆలయ నిర్వహణ.. సుప్రీం కోర్టు
, సోమవారం, 13 జులై 2020 (14:14 IST)
2011లో కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపదలు వెలుగుచూశాయి. అంతులేని సంపదతో ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. 
 
అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 
 
ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ వంశానికి కట్టబెట్టింది. త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలోనూ కమిటీని కూడా నియమిస్తున్నట్టు తెలిపింది. ఇది, ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్యే మార్గంగా ఉంటుందని స్పష్టం చేసింది. 
 
పద్మనాభస్వామి ఆలయ పాలన బాధ్యతను రాజకుటుంబానికి అప్పగించడాన్ని ధర్మాసనం సమర్థించింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని తెలిపింది. ఆలయంపై రాజ కుటుంబం హక్కులను సమర్ధించింది. ఈ వివాదంపై 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ప్రస్తుతం తీర్పు అనుకూలంగా వచ్చింది. 1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు ముగిసిపోయాయని కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దుచేసింది.
 
వాస్తవానికి ఈ కేసుపై విచారణను గతేడాది ఏప్రిల్‌లో పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, తుది తీర్పును సోమవారం వెలువరించింది. ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలని కేరళ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజవంశం.. తమకే హక్కులు ఉంటాయని వాదించింది. ఈ వాదనలను సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం.. వారికే అనుకూలంగా తీర్పు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్: సచిన్ పైలట్ తిరుగుబాటు... సంక్షోభంలో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం