Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివసేన చెట్టుకు తెగులు సోకింది.. ఆకులను తుంచిపారేయాలి: ఉద్ధవ్ ఠాక్రే

uddhav thackeray
, శనివారం, 25 జూన్ 2022 (11:40 IST)
తమ పార్టీకి శివసైనికులే సంపద అని శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అంతేకాకుండా, "మీరు ఒక చెట్టు నుంచి పండ్లను, పూలను తీసేసుకోవచ్చు. కానీ వేర్లు బలంగా ఉన్నంత కాలం నేను ఆందోళన చెందాల్సిన పనిలేదు. వేర్లను మాత్రం పెకళించలేరు. ప్రతి రుజువులో కొత్త ఆకులు చివురిస్తాయి. కొత్తగా పండ్లు కాస్తాయి. తెగులు సోకిన ఆకులను తుంచిపారేయాలి. ప్రస్తుత పరిస్థితిని ఆ కోణంలోనే చూడాలి" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఆయన శివసేన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ, సామాన్య శివసేన కార్యకర్తలే తమ సంపద అని.. వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోబోనని స్పష్టం చేశారు సొంత మనుషులే శివసేనకు ద్రోహం తలపెడుతున్నారని వ్యాఖ్యానించారు. పరోక్షంగా గౌహతిలో మకాం వేసిన రెబెల్ నేత ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
'మీలో చాలా మంది ఎన్నికల్లో టికెట్లు ఆశించారు. అయినా, నేను వీరికి (రెబల్‌ ఎమ్మెల్యేలకు) కేటాయించాను. మీ కృషి, కష్టం వల్ల గెలిచిన వీరు ఇప్పుడు అసంతృప్తికి గురవుతున్నారు. మీరు మాత్రం ఈ క్లిష్ట సమయంలో పార్టీతో నిలబడ్డారు. మీకు కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు' అని కార్పొరేటర్లు, ఇతర నాయకులను ఉద్దేశించి ఉద్ధవ్‌ అన్నారు. 
 
అంతేకాకుండా, 'మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు భాజపాతో చేతులు కలపాలని కోరుతున్నారని షిండే నాతో చెప్పారు. ఆ ఎమ్మెల్యేలను నా దగ్గరకు తీసుకొస్తే చర్చిద్దామని చెప్పాను. భాజపా మమ్మల్ని చాలా దారుణంగా చూసింది. హామీలను నెరవేర్చలేదు. ఈ రెబల్‌ ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయి. ఇప్పుడు వారంతా భాజపాతో వెళితే శుద్ధి అయిపోతారు. ఒకవేళ వారంతా మాతో ఉంటే జైలుకు వెళతారు. ఈ చర్యలు మిత్రుత్వానికి సంకేతమా? అని ప్రశ్నించారు. 
 
ఒకవేళ శివసేన కార్యకర్త ముఖ్యమంత్రి అయితే మీరు భాజపాతో వెళ్లండి. కానీ, ఇప్పుడు మీరు (ఏక్‌నాథ్‌ షిండే) మహా అయితే డిప్యూటీ సీఎం అవుతారేమో. ఆ విషయం నాతో చెబితే నేనే మిమ్మల్ని ఉపముఖ్యమంత్రి చేసేవాణ్ని కదా' అంటూ ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు. అదేసమయంలో శివసేన కార్యకర్తలు తనను అసమర్థుడిగా భావిస్తే తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ఉద్ధవ్‌ ప్రకటించారు. 
 
శివసేన ఒక ఐడియాలజీ అని.. భాజపా హిందుత్వ ఓట్లను ఇంకెవరితోనూ పంచుకోవాలనుకోవట్లేదన్నారు. అందుకే తమ పార్టీని అంతం చేయాలని చూస్తోందన్నారు. హిందుత్వ ఓట్లు చీలొద్దన్న ఉద్దేశంతోనే బాల్‌ ఠాక్రే గతంలో భాజపాతో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేసుకున్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలకు భాజపాతో కలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో రెబల్‌ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవబోరని తెలిపారు. వీలైతే శివసేన ఓటర్లను తీసుకెళ్లండని షిండే, భాజపాకు ఠాక్రే సవాల్‌ విసిరారు. ఇప్పటికీ పార్టీని వీడాలనుకుంటుకున్నవారు వెళ్లిపోవచ్చన్నారు. తాను కొత్త శివసేనను నిర్మించుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ధీమా ప్రకటించారు. పనిలోపనిగా షిండేకు చురకలు అంటించారు. షిండే కుమారుడు పార్లమెంట్ సభ్యుడు స్థాయికి ఎదగవచ్చు.. తన కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో ఎదగకూడదా? అంటూ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి రజిని, తానేటి వనితలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం