అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భర్త కంటే ప్రేమించిన ప్రియుడే ఎక్కువ అనుకుంటే అతడితోనే పారిపోవచ్చు కదా.. అన్యాయంగా నా అన్న ప్రాణాలు ఎందుకు తీశావంటూ మృతుడు రాజా రఘువంశీ సోదరి శ్రస్తి రఘువంశీ ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రాజా హత్యతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన రఘువంశీ కుటుంబం, పోలీసుల విచారణలో బయటపడుతున్న వాస్తవాలతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తన సోదరుడుని కిరాయి హంతకులతో వదినే చంపించిందని తెలిసి జీర్ణించుకోలేకపోతోంది.
సోషల్ మీడియా వేదికగా శ్రస్తి తన మనోవేదనను పంచుకున్నారు. సోనమ్కు ఆమె ప్రియుడే ఎక్కువ అనుకుంటే ఇంట్లో నుంచి పారిపోయే అవకాశం ఉందన్నారు. రాజా, సోనమ్ ఇద్దరిని అడిగి తెలుసుకున్నాకే తన తల్లిదండ్రులు ఈ వివాహం చేశారన్నారు. అప్పటికే ప్రియుడు ఉన్నపుడు, ప్రియుడుతోనే కలిసి ఉండాలని అనుకున్నపుడు సోనమ్ తన అన్నతో వివాహమాడేందుకు ఎందుకు అంగీకరించిందని శ్రస్తి ప్రశ్నించింది.
ఆమె తల్లిదండ్రులు బలవంతం చేస్తే పెళ్లికి ఒప్పుకుంది అంటే పెళ్లయ్యాక కూడా తన ప్రియుడుతో పారిపోవచ్చు కదా, పోనీ సోనమ్ అవేమీ చేయకుండా అన్యాయంగా తన అన్నను చంపించిందని శ్రస్తి ఆరోపించారు.
మా అన్నయ్య ఏడు జన్మల తోడుంటానని సోనమ్కు ప్రమాణం చేశాడు. కానీ, ఆమె ఏడు రోజులు కూడా మా అన్నతో ఉండలేకపోయింది. నా సోదరుడు ఏం తప్పు చేసాడని చంపేశావ్.. నీకు వేరొకరు నచ్చితే వారితోనే పారిపోవచ్చు కదా.. ఎందుకు చంపావ్... ఒకరికి సోదరుడుని, మరొకరికి కొడుకును ఎందుకు దూరం చేశావే.. అంటూ తన ఇన్స్టా ఖాతాలో ఓ వీడియోను ఆమె పోస్ట్ చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.