Publish Date: Tue, 10 Jun 2025 (10:10 IST)
Updated Date: Tue, 10 Jun 2025 (10:47 IST)
భారతదేశంలో 55.44 కోట్ల జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. వీటిలో 56 శాతం మహిళలవే. ఈ డిపాజిట్లలోని మొత్తం ఈ ఏడాది మే 21 నాటికి రూ. 2.5 లక్షల కోట్లను అధిగమించిందని ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు వెల్లడించారు.
ఓ సెమినార్లో రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. "ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ప్రారంభం భారతదేశంలో ఒక కీలకమైన క్షణంగా మారింది. జన్ ధన్ యోజన - ఆధార్ - మొబైల్ అంటే, JAM త్రిమూర్తులు, అన్ని పెద్దలకు బ్యాంకింగ్ సేవలను పొందేలా చేసే మా ప్రయత్నంలో ఒక పెద్ద ముందడుగును అందించాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా మారింది.
పేదలకు జన్ ధన్ ఖాతాలతో చాలా మేలు జరిగింది" అని చెప్పారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో, డిజిటల్ చెల్లింపులు సంవత్సరానికి 35 శాతం పెరిగి రోజుకు 60.81 కోట్ల లావాదేవీలకు చేరుకున్నాయి. వీటిలో UPI 83.73 శాతం లావాదేవీలను కలిగి ఉంది.