ఏసీ ఫస్ట్క్లాస్ బోగీలో ప్రయాణం చేసిన ముగ్గురు ప్రయాణికులు ఆ బోగీలోని దుప్పట్లను చోరీ చేసి రైల్వే సిబ్బందికి పట్టుబడ్డారు. కోచ్ అటెండెంట్ ఫిర్యాదుతో టీటీఈ సదరు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా ఈ చోరీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు.. థూ.. వీళ్ల పాడుబుద్ధి అటూ మండిపడుతున్నారు. ఇదేం కురచబుద్ధి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన పురుషోత్తమ్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి ఒడిశాలోని పూరి ఆలయ సందర్శనకు వెళ్లాడు. వారు ముగ్గురూ పురుషోత్తం ఎక్స్ప్రెస్లో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఏసీ కోచ్ కావడంతో రైల్వే సిబ్బంది వారికి బెడ్ షీట్లు, టవల్స్ అందించారు. ప్రయాణంలో ఉపయోగించుకుని వాటిని అక్కడే వదిలేయాల్సి ఉండగా.. సదరు ప్రయాణికులు మాత్రం ఎంచక్కా ఆ దుప్పట్లు, టవల్స్ను మడతపెట్టి తమ బ్యాగుల్లో సర్దేసుకున్నారు. ఆపై ఏమీ తెలియనట్లు రైలు దిగి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.
ఇది గమనించిన కోచ్ అటెండెంట్ వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేశాడు. టీటీఈ కల్పించుకుని ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేయగా.. బెడ్ షీట్లు, టవల్స్ బయటపడ్డాయి. అయితే, తన తల్లి పొరపాటున వాటిని బ్యాగులో పెట్టి ఉండొచ్చని ఆ యువకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, టీటీఈ మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే అంటూ వారికి రూ.780 జరిమానా విధించాడు. ఆ మొత్తం వెంటనే చెల్లించకపోతే రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో సదరు ప్రయాణికులు ఆ జరిమానా కట్టేసి వెళ్లిపోయారు.