ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకుని నేరుగా తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఖైదీని అదుపులోకి తీసుకుని తిరిగి సబ్ జైలుకు పంపించారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకుని ప్రియురాలి ఇంటిలో దాగిన ఖైదీని కేవలం 24 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం.
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగలాపురానికి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తిని గత నెల 20 తేదీన దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సత్యవేడు సబ్ జైలులో ఉంటున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు నుంచి శ్రీనివాసన్ కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అతని ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు నగరంలో గాలింపు చర్యలు చేపట్టగా, తన పాత ప్రియురాలు ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని మళ్లీ సబ్ జైలుకు తరలించారు.