జూన్ 22, 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగ భక్తరగల్ మానాడు (మురుగన్ భక్తుల సదస్సు)లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే రోజు మధురై విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇతర బిజెపి నాయకులు సాదరంగా స్వాగతం పలికారు.
ఆయన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేస్తూ సనాతన ధర్మం, సాంప్రదాయ సాంస్కృతిక విలువల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుండి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు భారీగా హాజరయ్యారు. ఇకపోతే.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ నుండి విరామం తీసుకున్నాడు.
అలాగే ఆదివారం మధురైలో జరిగిన భారీ మురుగన్ భక్తుల సమావేశంలో తమిళనాడు అంతటా వేలాది మంది భక్తులు 'కంధ షష్టి కవసం'ను జపిస్తూ, హిందూ సంస్కృతి, మతం, సంప్రదాయాలను రక్షించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా ఆరు కీలక తీర్మానాలను ఆమోదించారు.
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు, మురుగన్ భక్తులు ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రారంభమై కంద షష్టి కవసం యొక్క పెద్ద ఎత్తున పారాయణంతో ముగిసింది.
ఈ సభలో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కుమార స్వామి గొప్పతనాన్ని ప్రశంసించారు. ధర్మం అంటే అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం అంటూ పేర్కొన్నారు. తమిళనాడులో మురుగన్ ఔచిత్యాన్ని ప్రశ్నించే వ్యతిరేకులను కూడా పవన్ కళ్యాణ్ విమర్శించారు.
తమిళనాడులో మురుగన్ సమావేశం ఎందుకు జరుగుతుందో అడగడం తమిళ సంస్కృతి ఆత్మను ప్రశ్నించడం లాంటిది. మన దేవుళ్ళు, మన దేవాలయాలు, మన ధర్మాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.