రైలు ప్రయాణ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విధానంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టిక్కెట్లకు కూడా వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. తత్కాల్ బుకింగ్లో అక్రమాలకు అరికట్టేందుకు ఈ నిబంధనను అమలు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ఇందులోభాగంగా, గత నవంబరు 17వ తేదీ నుంచి ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ ఓటీపీ ఆధారిత తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత కొన్ని రైళ్లతో మొదలుపెట్టి తర్వాత 52 రైళ్లకు విస్తరించింది.
రాబోయే కొద్ది రోజుల్లో ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంటే ఇకపై కౌంటర్ వద్ద రిజర్వేషన్ ఫారమ్ నింపిన తర్వాత బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తేనే టిక్కెట్ బుక్ అవుతుంది. తద్వారా అక్రమార్కులు, ఏజెంట్ల దందాను అరికట్టవచ్చన్నది రైల్వే శాఖ భావనగా ఉంది.