Publish Date: Thu, 14 May 2020 (18:35 IST)
Updated Date: Thu, 14 May 2020 (18:36 IST)
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై మొదటి రోజు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం గురించి మాట్లాడిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా గ్రామీణ ఆర్థికం, వలస కూలీల సమస్యలు, రైతులు సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దీనిని దేశ వ్యాప్తంగా అమలులోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు. దీని ప్రకారం రేషన్ కార్డ్ ఉన్నవారు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దీన్ని పోర్టబిలిటీ విధానం అంటారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఈ విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ఇకపై ఇది దేశవ్యాప్తంగా అమలు కానుంది. దీని వల్ల 23 రాష్ట్రాలలోని 67 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల ప్రజా పంపిణీలో భాగమైన 83 శాతం మందికి ప్రయోజనం ఉంటుందని కూడా చెప్పారు.