Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మకు తెలియకుండా గోవా ట్రిప్.. డ్రామా చేసిన యువతి అరెస్ట్

అమ్మకు తెలియకుండా గోవా ట్రిప్.. డ్రామా చేసిన యువతి అరెస్ట్
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (19:12 IST)
సీక్రెట్ గోవా ట్రిప్ తల్లికి తెలియకుండా ఉండేందుకు ఓ యువతి ఆడిన నాటకానికి ఇమ్మిగ్రేషన్ అధికారుల జోక్యంతో శుభం కార్డు పడింది. అంతేకాదు, పాస్‌పోర్ట్‌లో తేదీని ఫోర్జరీ చేసినందుకు ఆమెపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే... సయద్ అనే ముంబైకి చెందిన యువతి గత మూడేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. 
 
ఫ్రెండ్‌తో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లేందుకు గత సంవత్సరం మార్చి 14న ఆమె ముంబైకి వచ్చింది. అయితే.. నేరుగా ఇంటికి వెళ్లకుండా సీక్రెట్‌గా ఫ్రెండ్‌తో కలిసి గోవాకు వెళ్లింది. మళ్లీ మార్చి 20న ముంబైకి తిరిగొచ్చిన సయద్ అప్పుడు ఇంటికి వెళ్లింది. అయితే... మార్చి 14నే ముంబైకి వచ్చిన సయద్ మార్చి 20నే తాను ముంబైకి వచ్చానని తన తల్లిని నమ్మించేందుకు పాస్‌పోర్ట్‌లో ఫోర్జరీకి పాల్పడింది. 
 
గోవా నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సయద్ ఓ స్టేషనరీ షాప్ వద్ద ఆగి రబ్బర్ స్టాంప్ కొనుక్కొని అరైవల్ డేట్‌ను మార్చింది. మార్చి 20న ముంబైకి వచ్చినట్లు మార్పులుచేర్పులు చేసింది.
 
అయితే.. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అంతర్జాతీయ ప్రయాణాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఇంట్లోనే ఉన్న సయద్ ఫిబ్రవరి 19, 2021న తిరిగి దుబాయ్‌కు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. 
 
ఫిబ్రవరి 19న ఇమ్మిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆమె పాస్‌పోర్ట్ తేరిపారా చూడగా... సిస్టమ్‌లో ఆమె అరైవల్ డేట్ మార్చి 14, 2020గా కనిపించింది. ఆమె పాస్‌పోర్ట్‌లో మాత్రం మార్చి 20గా కనిపించడంతో ఈ విషయంపై ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు సయద్‌ను విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది.
 
గోవా ట్రిప్ గురించి తన తల్లికి తెలియకుండా ఉండేందుకే తాను పాస్‌పోర్ట్‌లో తేదీని మార్చినట్లు సయద్ చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. అధికారులు ఆమెను సహర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పతంజలి కరోనిల్.. వివరణ ఇచ్చిన ఆచార్య బాలకృష్ణ