ఆర్ఎస్ఎస్ మీటింగ్కు ప్రణబ్ వెళ్లడంతో తప్పులేదు : సుశీల్ కుమార్ షిండే
ఈనెల 7వ తేదీన జరుగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తృతీయ వర్ష శిక్షణ ముగింపు కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Publish Date: Mon, 04 Jun 2018 (12:50 IST)
Updated Date: Mon, 04 Jun 2018 (12:52 IST)
ఈనెల 7వ తేదీన జరుగనున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తృతీయ వర్ష శిక్షణ ముగింపు కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సీకే జాఫర్ షరీఫ్ వంటివారితో పాటు.. పలువురు నేతలు నేతలు ప్రణబ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, మరో సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే మాత్రం ప్రణబ్ తీసుకున్న నిర్ణయంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించడంలో తప్పు లేదని, అసలు ప్రణబ్ ఆ మీటింగ్కు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రణబ్ లౌకికవాది, మంచి ఆలోచనపరుడు అని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ వేదికపై ప్రణబ్ మాట్లాడటం ముఖ్యమైన అంశంగా తీసుకోవాలన్నారు. ప్రణబ్ ఆ వేదికపై పంచుకునే ఆలోచనలు బీజేపీలోగానీ లేదా ఆర్ఎస్ఎస్లో కొంత అభివృద్ధిని తీసుకువచ్చే అవకాశం ఉందని షిండే తెలిపారు.
కాగా, ఆరెస్సెస్ తృతీయ వర్ష శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకావొద్దని ఎన్ని సూచనలు చేస్తున్నా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మాత్రం వాటిని బేఖాతరు చేస్తున్నారు. నేను ఏం చెప్పదల్చుకున్నానో అవన్నీ నాగ్పూర్లోనే మాట్లాడుతాను. ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లొద్దని నాకు ఇప్పటివరకు చాలా లేఖలు, ఫోన్లు వచ్చాయి. అయితే అందులో ఏ ఒక్కదానికి నేను స్పందించలేదు అని ప్రణబ్ ముఖర్జీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన విషయం తెల్సిందే.