Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుమ్మురేపుతున్న కరోనా కేసులు - మరో 6088 పాజిటివ్ కేసులు

Advertiesment
Covid 19
, శుక్రవారం, 22 మే 2020 (09:54 IST)
కరోనా వైరస్ దుమ్మురేపుతోంది. ఫలితంగా రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో మరో 6,088 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.18 లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. 
 
దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఇకపోతే, ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 3,583కి చేరుకుంది. గ‌త 24 గంట‌ల్లో 148 మంది క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌లో ఉన్న 80 శాతం బెడ్‌ల‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎపిడ‌మిక్ డిసీజ్ చ‌ట్టం కింద మ‌హా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ చ‌ట్టంతో ప్రైవేటు ఆస్ప‌త్రి బెడ్‌ల‌ను ప్ర‌భుత్వం త‌మ ఆధీనంలోకి తీసుకుంటుంది. చికిత్స బిల్లుల‌పై  ప్ర‌భుత్వమే ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేసింది. 
 
ఇదిలావుంటే, కరోనా బారినపడి దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో 103 మంది 30 ఏళ్లలోపు వారేనని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 15 ఏళ్లు లోపు వారు 17 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. 
 
కరోనా బారినపడిన వీరు గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించినట్టు తెలిపింది. ఇక, గురువారం ఉదయం వరకు దేశంలో 3,435 మరణాలు సంభవించగా, వీరిలో 60 పైబడిన వారు 50.5 శాతం మంది ఉన్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
 
ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారిలో 1,734 మంది 60 ఏళ్లు పైబడినవారు కాగా, 45-60 ఏళ్ల మధ్య వయసున్న వారు 1,205 మంది, 30-45 ఏళ్ల లోపువారు 392 మంది, 15-30 ఏళ్ల లోపు ఉన్నవారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల్లో 2,500 మందికి పైగా అప్పటికే మధుమేహం, రక్తపోటు, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
 
చనిపోయిన వారిలో 2,198 పురుషులే కావడం గమనార్హం. ఇక, కరోనా మరణాల రేటు ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 6.65 శాతంగా ఉన్న మరణాల రేటు భారత్‌లో మాత్రం 3 శాతానికి కొద్దిగా పైన ఉందని ప్రభుత్వం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెమోరియల్ హౌస్‌గా మారనున్న జయలలిత నివాసం