మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతుల హనీమూన్ ప్రయాణం విషాదాతంగా ముగిసిన విషయం తెల్సిందే. మేఘాలయాలోని అందమైన కొండ ప్రాంతాల్లో మొదలైన వారి కొత్త జీవితం, భర్త హత్యతో భయానక క్రైమ్ థ్రిల్లర్గా మారింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి భార్య సోనమ్, ఆమె ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించినట్టు తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. ఇపుడు దర్యాప్తులో వెలుగు చూస్తున్న వివరాలు హత్య వెనుక ఉన్న ప్రణాళిక, అమలు, నాటకీయ పరిణామాలను బయటపెడుతున్నాయి.
పోలీసుల కథనం మేరకు... మే 20వ తేదీన ఈ కొత్త దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు బయలుదేరారు. వన్ వే టికెక్తో ప్రయాణించిన వీరిని ముగ్గురు హంతకులు రహస్యంగా ఫాలో అయినట్టు సమాచారం. నిజానికి ఈ దంపతులు తమ హనీమూన్ను కాశ్మీర్లో ప్లాన్ చేసుకున్నారు. కానీ, అక్కడ ఉగ్రదాడులు జరగడంతో మేఘాలయకు మార్చారు. మేఘాలయాలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన వీరు మే 22వ తేదీన నోంగ్రియాట్ గ్రామంలోని ప్రసిద్ధి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను సందర్శించి ఆ రాత్రికి అక్కడే బస చేశారు.
23వ తేదీ ఉదయం హోమ్స్టే నుంచి చెక్ ఔట్ చేసిన దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటరుపై సందర్శనీయ స్థలాలకు బయలుదేరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి కుటుంబ సభ్యులతో మొబైల్ సంబంధాలు తెగిపోయాయి. ఆ సమయంలో సోనమ్ అలసిపోయినట్టుగా నటించి, భర్త వెనుక నడవసాగింది. పిమ్మట హంతకులను ఉద్దేశించి అతన్ని చంపేయండి అని అరిచిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
కొన్ని రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. పోలీసులు సోనమ్ కదలికలను ట్రేస్ చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్లో ఉన్నట్టు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అయితే, కిడ్నాపర్లు తనకు మత్తుమందు ఇచ్చి ఇక్కడకు ఎలా తీసుకొచ్చారో తనకు తెలియదని పోలీసులకు చెప్పింది. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే తన భర్త రాజ్ను హత్య చేయాలని సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసినట్టు పోలీసులు బలంగా నమ్ముతున్నారు.