Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నోసార్లు జైలుకెళ్లా: విజయశాంతి

ఎన్నోసార్లు జైలుకెళ్లా: విజయశాంతి
, గురువారం, 31 అక్టోబరు 2019 (07:32 IST)
13 ఏళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మేకప్ వేసుకున్నారు.

ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కేరళలో ఈ మూవీ ఆఖరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశానికి గల కారణాలను తెలిపారు.

‘‘రాజకీయాలు, సినిమాలు ప్రజలు, ప్రజా జీవితాలతో ముడిపడి ఉంటాయి. కొన్ని సినిమాలు, పాత్రలు నన్ను రాజకీయాలవైపు ఆకర్షించాయి. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో ప్రజల జీవితంలోని చీకటి కోణాలను చూడగలిగా. అప్పుడే రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. తెలంగాణలో ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనంపై ఒక అవగాహన వచ్చింది.

పెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతే అభివృద్ధి జరుగుతుందని భావించా. ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా 1998 జనవరి 26న రాజకీయ జీవితాన్ని ప్రారంభించా. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ లేదు. తెలంగాణ ఉద్యమం కూడా ప్రారంభంకాలేదు.

ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే ఉద్యమాన్ని ప్రారంభించా. ఉద్యమంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ఎన్నోసార్లు జైలుకు వెళ్లా.. చంచల్‌గూడ జైల్లో ఖైదీలతో కూర్చుని తెలంగాణ ఉద్యమంపై చర్చలు జరిపా.

జైల్లో ఉండి ఉద్యమాన్ని కొనసాగిస్తే ఆ క్రెడిట్ నాకు దక్కుతుందని బెయిల్ తెప్పించి మరీ విడుదల చేయించారు. చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాం. కానీ వాళ్ల వల్లే తెలంగాణ వచ్చిందని కొందరు చెప్పుకుంటున్నారు. పార్టీ పరంగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించా.

మొత్తానికి ప్రజల్లో రాజయకీయంగా నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజల అభిమానాలు, అప్యాయతలు తగ్గలేదు. ఉద్యమ సమయంలో కూడా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని రిజెక్ట్ చేశా.

సినిమాలంటే జనాలను ఎంటర్‌టైన్ చేయడం, రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడం. రెండూ ప్రజలతో ముడిపడినవే. రాజకీయాలను వీడేది లేదు. సినిమాలను కూడా వదులుకునేది లేదు’’ అని చెప్పారు.
 
ఇంకా ‘‘చాలా కాలం తర్వాత నటిస్తున్నాను. సెట్లో అందరూ అభిమానంగా, ఆదరంగా చూస్తున్నారు. మహేశ్, నాకు పాత్రల మధ్య సవాళ్లు లేవు. ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేశ్ బాబు బాలనటుడిగా నాతో నటించారు. ఇప్పుడు మహేశ్ సూపర్ స్టార్ అయ్యారు.

ఈ బాబు సూపర్ స్టార్ అవుతారని అప్పుడే అనుకున్నా. క్రికెట్‌లో సచిన్ ఎలా సెన్సేషనల్ అయ్యారో..మహేశ్ బాబు కూడా అలానే దూసుకొచ్చారు. సెట్లో కృష్ణలాగే మహేశ్ కూడా చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎక్కువగా మాట్లాడరు. 50 రోజులు పని చేశాం. ఎప్పుడూ చిలిపిగా కనిపించలేదు.

మహేశ్ నన్ను అమ్మా అని అంటారు. లేదంటే మేడం అని పిలుస్తారు. నేను మహేశ్‌ను బాబు అని అంటా. లేదంటే మీరు అని సంబోధిస్తా. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఇంకా సినిమాలేమీ అనుకోలేదు. ఆఫర్లు వస్తే సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ విదేశాలకు రాహుల్