మ్యాగీ నూడుల్స్ ధ్వంసంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంస్థ.. 30కి వాయిదా
భారత్ మార్కెట్లోకి మళ్లీ మ్యాగీ నూడుల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో సీసం పరిమాణం అధికంగా ఉందన్న కారణంతో ఈ మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆపై కొన్ని నెలల క్రితం భార
భారత్ మార్కెట్లోకి మళ్లీ మ్యాగీ నూడుల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో సీసం పరిమాణం అధికంగా ఉందన్న కారణంతో ఈ మ్యాగీ నూడుల్స్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆపై కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లోకి మ్యాగీ నూడుల్స్ వచ్చాయి. తాజాగా నెస్లే ఇండియా యాజమాన్యం మ్యాగీ నూడుల్స్ను ధ్వంసం చేసే పనిలో పడింది. ఇంకా ధ్వంసం చేసే విషయమై నెస్లే ఇండియా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గడువు తీరిన 550 టన్నుల నూడుల్స్ నిల్వల ధ్వంసంకు అనుమతి విషయమై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అంగీకరించకపోవడంతో సంస్థ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నెస్లే సంస్థ గతంలో ఇదే సమస్యను లేవనెత్తిందని, ఈ వ్యవహారంలో అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి. నాగప్పన్తో కూడిన బెంచ్ ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. మ్యాగీ నూడుల్స్లో సీసం, రుచిని పెంచే మోనోసోడియం గ్లుటామేట్ స్థాయులు పరిమితి కంటే ఎక్కువగా ఉండటంతో భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.